16, అక్టోబర్ 2017, సోమవారం

Projects ప్రాజెక్టులు

రికార్డుస్థాయిలో ప్రాజెక్టులకు అనుమతులు
-శరవేగంగా సాగుతున్న నిర్మాణాలు
-పర్యావరణ రక్షణకు అవసరమైన చర్యలు
-ప్రాణహిత ఎకో-వంతెనలపై నెగ్గిన రాష్ట్రం వాదన
-అనుమతులపై అటవీశాఖ స్పెషల్‌డ్రైవ్

మూడేండ్ల క్రితం దాకా నీటిపారుదల ప్రాజెక్టులంటే.. గ్రానైట్‌రాళ్లపై పేర్లు చెక్కించుకొని.. దానికో తెరకట్టి తాడుతో తొలిగించి.. ఫొటోలు దిగి ఆహాఓహో అంటూ వందిమాగధబృందం చేసే ప్రచారార్భాటాలతో జనాన్ని మభ్యపెట్టడం తప్ప మరొకటి జరుగలేదు. ఉమ్మడిరాష్ట్రంలో పర్యావరణ, అటవీఅనుమతులు రాక ఏండ్ల తరబడి.. పనులు మొదలుకాని ప్రాజెక్టులు ఎన్నో.. 2014 జూన్ 2తరువాత ఈ పరిస్థితిలో అనూహ్యంగా మార్పువచ్చింది. రికార్డుస్థాయిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేస్తున్నాయి. కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నా అన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాగు, తాగునీటి ప్రాజెక్టులతోపాటు రహదారుల నిర్మాణాలు, వైద్య, ఆరోగ్యయూనిట్ల ఏర్పాట్లు చకచకా జరుగటం చూస్తుంటే పక్కరాష్ర్టాలు ఔరా అంటున్నాయి. ప్రాజెక్టుల పనుల్లో జాప్యంలేకుండా అటవీశాఖ ప్రత్యేకడ్రైవ్‌ను నిర్వహిస్తున్నది. ప్రతి శుక్రవారం భేటీ అయి కేంద్రస్థాయిలోని అనుమతులపై పర్యవేక్షిస్తున్నది. ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్‌ఝా అధికారులకు స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర వివాదాలకు తావివ్వరాదని ఆదేశాలిచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఏ ప్రాజెక్టుచేపట్టినా పర్యావరణపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఫలితంగా దాదాపు 244ప్రాజెక్టులకు పైగా అటవీ అనుమతులను సాధించింది. వీటిలో 137ప్రాజెక్టులకు మొదటి దశ అనుమతులు వచ్చాయి. మరో 37ప్రాజెక్టులకు తుదిదశ అనుమతులు వచ్చాయి. 70ప్రాజెక్టుల కోసం అవసరమైన ప్రక్రియ పూర్తయింది. అటవీమార్గాల్లో డబుల్‌లేన్ రోడ్లను, నీటిపైప్‌లను నిర్మిస్తున్నది. నష్టపోతున్న అడవులను తిరిగి సృష్టించడానికి కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ (కంపా) కింద ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయిస్తున్నది.
కాళేశ్వరం రికార్డు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 3168హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాల్సి వచ్చింది. సాధారణంగా 100హెక్టార్ల కంటే ఎక్కువ భూమి బదలాయింపునకు అటవీ, పర్యావరణ అనుమతులకోసం కనీసం ఏడాది పడుతుంది. కానీ ప్రభుత్వం చకాచకా నిబంధనలన్నింటినీ పూర్తిచేయడంతో 40రోజుల్లోనే అనుమతులు సాధ్యమయ్యాయి. ఇది దేశంలో అన్ని ప్రాజెక్ట్‌లలో రికార్డు సమయంగా చరిత్రకెక్కింది.
నెగ్గిన రాష్ట్రం వాదన-తగ్గిన 300 కోట్ల భారం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్- ప్రాణహిత ప్రాజెక్టులో పర్యావరణ అనుమతుల కోసం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో రాష్ట్ర అధికారుల వాదన నెగ్గింది. మొదట టైగర్ కారిడార్‌లో 18ఎకో-వంతెనలను నిర్మించాలని పట్టుబట్టిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) చివరకు 9వంతెనల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఒక్కో ఎకో-వంతెన వెడల్పును వంద నుంచి 50మీటర్లకు తగ్గించడానికి అంగీకరించింది. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం తగ్గింది. ప్రాణహిత ప్రాజెక్టులో భాగమైన తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణంలో భాగంగా ఆసిఫాబాద్ కాగజ్‌నగర్ టైగర్ కారిడార్‌లో పెద్దపులులు, వన్యప్రాణుల సంచారానికి ఆటంకంలేకుండా వీటిని నిర్మిస్తారు. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి కాగజ్‌నగర్ డివిజన్‌లో 622 హెక్టార్ల అటవీభూమి అవసరమవుతున్నది. బెజ్జూరు, గూడెం, కడంబ,హెట్టి రిజర్వ్‌ఫారెస్టుల్లో బరాజ్‌ల పనులు జరుగనున్నాయి.
అభయారణ్యాలలోనూ మిషన్ భగీరథకు లైన్‌క్లియర్
మిషన్‌భగీరథకు రికార్డుస్థాయిలో కేంద్రంనుంచి అటవీ,పర్యావరణ అనుమతులు లభించాయి. 92ప్యాకేజీలలో 60కి పైగా అటవీ అనుమతులు లభించడం విశేషం. అభయారణ్యాలలో 23ప్యాకేజీలుగా ఉన్న పనులకు నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ పూర్తిస్థాయిలో అనుమతినిచ్చింది. అభయారణ్యాల్లో నిలిచిపోయిన 1,580కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అచ్చంపేట-అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, పోచారం, శివారం, ప్రాణహిత, కిన్నెరసాని, ఏటూరునాగారం, కవ్వాల్ టైగర్ కారిడార్‌లో పైప్‌లైనుపనులకు అనుమతులు వచ్చాయి. వివిధ ప్రాజెక్టుల కింద 158 అటవీ ప్రాంతాల్లో పనులను చేపట్టడానికి ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలను పంపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి