16, అక్టోబర్ 2017, సోమవారం

KALWAKURTHY కల్వకుర్తి

KALWAKURTHY కల్వకుర్తి
నోముల ప్రభాకర్ గౌడ్


కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం.
మూడు దశాబ్దాలుగా మూలుగుతున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం కాబోతున్నదని కళ్లలో వత్తులు వేసుకొని ఆశతో ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల కలలు నిజమవుతున్నవి. ముప్ఫై ఏండ్ల కిందట ప్రారంభించబడి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, కల్వకుర్తి ప్రాంత నాయకుల నిర్లిప్తత వల్ల ఈ ప్రాజెక్టు ప్రగతి నత్తనడకను తలపింపజేసింది. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు గోడమీది రాతలా, నేరవేరని కలలా, లేచిపడిన అలలా మిగిలిపోతుందని అనిపించింది. 2001లో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభించినప్పుడు కల్వకుర్తి ప్రాంతంలో ఆ ఉద్యమం ప్రభావం లేదు. నాడు నేను ఆ ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ప్రాధాన్యాన్ని, ఆవశ్యకతను తెలియజేసినప్పుడు ఈ ప్రాంత నాయకులు నన్ను గేలి చేశారు. ప్రజలు కూడా వారి భ్రమలో ఉండి ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే మనకేం ఒరుగుతుందని భావించారు. ఆనాడే ప్రత్యేక రాష్ట్రం వస్తే మన నిధులు, నీళ్లు వాడుకోవచ్చని చెప్పాను. మన ప్రాంత వనరులన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్నారని చెబితే నన్నొక సంకుచిత మనస్కుడిగా చిత్రీకరించారు. నేడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయిందంటే అది ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ పుణ్యమే. సరైన వర్షాల్లేక, కరువుతో అలమటించే రైతుల పాలిట వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టుపై ఎవ్వరూ సరైన సమయం లో సరైన దృష్టిపెట్టలేదు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు ఈ ప్రాజెక్టుకు కొంత ప్రాధా న్యం ఇచ్చినా అవి సర్వేల వరకే పరిమితమైంది. ఆ తర్వాత పోతిరెడ్డిపా డు లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యాన్ని ఇచ్చి మన నాయకుల నిరాసక్తతను ఆసరాగా తీసుకొని కావలసిన నిధులను విడుదల చేయక ప్రాజెక్టులో ప్రగతి ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.
నీళ్లులేక, కరువు కోరల్లో చిక్కిన ఈ ప్రాంత రైతులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి వలసల జిల్లాగా ప్రసిద్ధి గాంచింది. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన బడా భూస్వాములు కూడా వ్యవసాయం లాభసాటి కానందున ఇతర వ్యాపకాల కోసం పట్టణ ప్రాంతాలకు తరలివెళ్లారు. పల్లెటూర్లన్నీ బోసిపోయిన తరుణంలో నేను నమస్తే తెలంగాణ 2016 డిసెంబర్ 29న వ్యాసంలో రాసినట్లుగా కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామ నివాసి, ఒకనాటి అభ్యుదయ రైతు బందెల రాంచంద్రారెడ్డి ఈ ప్రాంత రైతుల దీనస్థితికి వ్యాకులత చెంది మాలాంటి వారి సహకారంతో కల్వకుర్తి రైతు జేఏసీగా ఏర్పడి ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ఉద్యమ కార్యాచరణను ఏర్పర్చుకున్నారు. వినూత్న పద్ధతులతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మేము రైతు జేఏసీ ఏర్పడిన తర్వాతే మిగ తా ఈ ప్రాంత ప్రతిపక్ష రాజకీయపార్టీలు మేల్కొని ఉద్యమం పేరుతో యాత్రలు చేపట్టారు. బీజేపీ నాయకుడు కల్వకుర్తి నుంచి శాసనసభకు మహాయాత్ర పేరు పెడితే, కాంగ్రెస్ శాసనసభ్యుడు గ్రామాల్లో పర్యటనలు చేశారు. కాని అవి నామమాత్రమే. అవి వారి ఉనికి కోసం ఆరాట మే తప్ప నిజమైన పోరాటం కాదు. వారు రాజకీయ లబ్ధి కోసం చేస్తే మా కన్వీనర్ బందెల రాంచంద్రారెడ్డి రైతు సమస్యగా ఉద్యమం కొనసాగించారు.
మిగతా ప్రతిపక్ష రాజకీయపార్టీలు నామమాత్రపు పర్యటనలు చేస్తే, మా రైతు జేఏసీ పట్టు వదలని విక్రమార్కునిగా, అలుపెరుగని యోధునిగా పలుకార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రాంచంద్రారెడ్డి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు, నిరంతరం పర్యటించి, గ్రామాలతోని రైతులను చైతన్యపరిచి ఉద్యమించారు. ఈ విషయంలో ఆయన సీఎం కేసీఆర్‌నే ఆదర్శంగా తీసుకున్నారు. గమ్యం చేరేవరకు మన గమనం ఆగకూడదని పలుమార్లు వెల్లడించారు. మా ఉద్యమానికి ముందు నుంచి ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ సిబ్బంది మంచి స్పందన కనబర్చి, మరిచిపోలేని సహకారమందించారు. ప్రాజెక్టు విలంబనకు కాంట్రాక్టర్ అలసత్వమే కానీ సిబ్బందిది ఏమాత్రం కాదు. ఉద్య మం ఫలితంగా నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు కూడా బాగా స్పందించి ఈ ప్రాంత టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి, ఒకటిరెండుసార్లు ఎక్కడైతే ప్రాజెక్టు పని పూర్తికావల సి ఉందో అక్కడే రాత్రి సమయంలో నిద్రించి, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి, సంబంధిత ఇంజినీర్లను, సిబ్బందిని అప్రమత్తంచేసి ప్రాజెక్టుకు పూర్తికావడానికి తోడ్పడ్డారు. ఒకనాడు నన్ను గేలి చేసినవారికి తలెత్తుకొని సగర్వంగా సమాధానం చెప్పగలిగే స్థితి లో ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే అది ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ పుణ్య మే.
ఈ విషయంలో ఒకనాడు మాపై, హరీశ్‌రావు పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేసినవారు నేడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రారంభం నుంచి మాకు సంపూర్ణ సహకారమందించిన ప్రాజె క్టు చీఫ్ ఇంజినీర్ ఖగేందర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ భద్రయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ జాదవ్‌లకు ఈ ప్రాంత ప్రజల తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, చివరి దశలో ఈ ప్రాంత ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆదేశించి ప్రాజెక్టు పనుల పర్యవేక్షింపజేసి, ఏండ్ల తరబడి నీళ్ల కోసం తపించిన ప్రజల దాహా ర్తి తీర్చబోతున్నారు. నేను ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం కల్వకుర్తి దాహం తీరాలె 2016 డిసెంబర్ 29న నమస్తే తెలంగాణలో ప్రచురితమైంది. ఈ వ్యాసం ప్రచురితమైన తర్వాతే ఈ ప్రాంత నాయకుల్లో చలనం కనిపించింది. మా విజ్ఞప్తులను, మా ఆకాంక్షలను, ప్రాజెక్టు పూర్తికోసం చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తెచ్చిన నీటిపారుదల శాఖామంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండేకు మా అభినందనలు. రాజకీయాలకు కొత్త అయిన ప్రాజెక్టు పనులను ఆఖరిదశలో పర్యవేక్షించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా మా అభినందనలకు అర్హుడే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి