16, అక్టోబర్ 2017, సోమవారం

Kallugita కల్లుగీత

Kallugita కల్లుగీత ...
నోముల ప్రభాకర్ గౌడ్

కల్లుగీతకు ఆధునిక హంగులు
-ఉచితంగా చెట్లు ఎక్కే యంత్రాలు
-శీతలపానీయాలకు దీటుగా నీరా
-సొసైటీలకు 5 ఎకరాల భూమి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కల్లుగీత వృత్తిని ఆధునీకరించి, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. చెట్లు ఎక్కి దిగే సమయాల్లో చాలామంది కిందపడిపోయి చనిపోతున్నారు. శాశ్వత వికలాంగులవుతున్నారు. ఇలాంటి విషాద సందర్భాలలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నది. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు చెట్లు ఎక్కే యంత్రాలు ఉచితంగా ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. అధికారులు ఇతర రాష్ర్టాల్లో పర్యటించి, వాటి పనితీరును పరిశీలించారు. భువనగిరిలో నిర్వహించిన ట్రయల్ రన్‌పై ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు సంతృప్తి వ్యక్తంచేశారు. హరితహారం కార్యక్రమంలోనూ ఈత తాటి వనాల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. రెండేండ్లలో 25 లక్షల మొక్కలు నాటటం ఇందుకు నిదర్శనం. కల్లుగీత సొసైటీలకు 5 ఎకరాల భూమి ఇస్తామంటూ కల్లుగీత పాలసీలో స్పష్టంచేసిన ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన భూముల్లో హైబ్రిడ్ మొక్కలు నాటించి, వాటిని గీతకార్మికులే సంరక్షించుకొనే విధంగా కార్యక్రమాలు రూపొందించింది.
కల్లు, ఈత, ఖర్జూర చెట్ల నుంచి తీసే నీరాను నిల్వచేసేందుకు బాట్లింగ్ యూనిట్లు నెలకొల్పి, శీతల పానీయాలకు దీటుగా మార్కెట్‌చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. దీనినుంచి బెల్లం, చక్కర, జామ్, చాక్లెట్స్, ఫామ్ వైన్‌లాంటి అనేక ఉప ఉత్పత్తులు పొందే అవకాశముంది. కల్లులో పోషక విలువలు ఉన్నాయని, క్యాన్సర్‌ను నివారించే గుణం ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించటం విశేషం. 65 ఏండ్లు నిండినవారికి ఇచ్చే వృద్ధాప్య పింఛన్లను కల్లుగీత కార్మికులకు 50 ఏండ్లు నిండగానే ఇస్తున్నది. చెట్లు ఎక్కి దిగే పనిలో త్వరగా వంట్లో సత్తువ కోల్పోతున్నారన్న ఉద్దేశంతో ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును తగ్గించింది. కల్లుగీత కార్మికులు ప్రభుత్వానికి ఏటా రూ. 15కోట్ల పన్ను కడుతున్నారు. ఒక్కొక్క చెట్టుకు పట్టణాల్లో రూ. 50, గ్రామాల్లో రూ.25 చొప్పున పన్ను చెల్లిస్తున్నారు. చెట్ల యజమానులకూ రూ. 50 నుంచి వంద దాకా చెల్లిస్తున్నారు. వీటిని మాఫీ చేసే ఆలోచనలో ప్రభు త్వం ఉన్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి